వరుస సినిమాలతో దూసుకెళ్లే నటుల్లో ముందుంటారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ప్రతి ఏడాది ఐదారు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారాయన. అలా ఆయనకు అధిక రెమ్యునరేషన్ లభిస్తుందని, సుమారు రూ.260 కోట్లు విలువ చేసే ప్రైవేట్ జెట్ విమానం ఆయన దగ్గర ఉందని హిందీ వెబ్సైట్ ఒకటి ఇటీవల కథనాన్ని ప్రచురించింది. అది అక్షయ్కు చేరగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఆ వార్తని ఖండిస్తూ 'లయర్, లయర్ ప్యాంట్స్ ఆన్ ఫైర్!.. దీన్ని నా బాల్యంలో విన్నా. కొంతమంది ఇప్పటికీ ఎదగలేదు. వారిని ఆ దశ నుంచి బయటకు తీసుకొచ్చే మూడ్ నాకు లేదు' అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సదరు వెబ్సైట్ పోస్ట్ చేసిన ఫొటోను షేర్ చేశారు. అది ఓ సినిమా చిత్రీకరణ సమయంలో అక్షయ్కుమార్, కథానాయిక వాణీకపూర్లు విమానం ముందు నిల్చొని దిగిన ఫొటో.
ఈ ఏడాది ఇప్పటికే బచ్పన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, కట్పత్లీతో సందడి చేసిన అక్షయ్ త్వరలోనే రామ్ సేతుతో కొత్త అనుభూతి పంచనున్నారు. రామసేతు వారధి రహస్యాల నేపథ్యంలో దర్శకుడు అభిషేక్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. టాలీవుడ్ హీరో సత్యదేవ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా కథానాయికలు.