అక్క అంటే ఆ తమ్ముడికి ఎనలేని మమకారం. పెళ్లి కూడా చేసుకోకుండా అక్క కుటుంబమే తనదిగా భావించి.. నిరంతరం వారి ఉన్నతి కోసం తపనపడేవారు. చివరికి రాఖీ పండుగ రోజే ఆ అక్కాతమ్ముడు అనంత లోకాలకు చేరారు. తోబుట్టువుల పండుగ నాడు అక్క అనారోగ్యంతో మృతి చెందటంతో.. అది తట్టుకోలేక తమ్ముడు కూడా గుండెపోటుతో మరణించారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా అనకాపల్లి శారదా కాలనీకి చెందిన లోలలితాదేవి.. కుమారై పద్మినీ రాణితో పాటు ఆమె తమ్ముడు ఎన్ఆర్ఎస్ రామచంద్రరాజు కలిసి నివసిస్తున్నారు. లలితా దేవి(84) ఆదివారం నాడు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి వచ్చాక రామచంద్రరాజు(76) తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాసేపటికి గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. రాఖీ పౌర్ణమి నాడే ఆ అక్కాతమ్ముల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి: MURDER: తండ్రినే హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే!