రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్లో వీరంగం సృష్టించిన నిందితుడు ఖోని గౌస్ను అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. సులేమాన్ నగర్ కాలనీల్లో రాత్రి వేళల్లో తిరుగుతూ వాహనాలను ధ్వంసం చేస్తూ హల్చల్ చేశాడని ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్తో పాటు ఉప్పల్ పీఎస్లో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. నిందితుని నుంచి రూ.25 లక్షలు విలువ చేసే 50 తులాల బంగారు ఆభరణాలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బైక్తో రెక్కీ.. తర్వాత చోరీ
ఖోని గౌస్ తన మోటార్ సైకిల్ పై కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేస్తాడని.. తన దగ్గర ఉండే వివిధ వస్తువులతో తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశిస్తాడని తెలిపారు. ఇటీవల సులేమాన్ నగర్లో రాత్రి వేళల్లో వీరంగం సృష్టించడంతో రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పోలీసు సిబ్బందికి రివార్డులు
శంషాబాద్ ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నాలుగు బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు గౌస్ను అరెస్టు చేశారని అన్నారు. నిందితునిపై పీడీ యాక్టు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గౌస్ను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని అభినందించి.. రివార్డులు అందజేశారు.
ఇదీ చదవండి: కిరాతకం: వ్యక్తిని కొడవళ్లతో నరికి చంపిన దుండగులు!