Life Imprisonment in Murder Case : 2013లో పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్లో జరిగిన హత్య కేసులో మేడ్చల్ కోర్టు తీర్పును వెలువరించింది. నిందితులిద్దరికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
ఆ కేసు వివరాలు..
Life Imprisonment in Pet Basheerabad Murder Case : ఆలేరుకు చెందిన శ్రీనివాస్(35), రజిని(33) వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని పద్మానగర్లో పక్కపక్క ఇళ్లలో నివాసముండేవారు. రజిని తరఫు ఓ బంధువు కృష్ణచైతన్య(22) అనే యువకుడు కొన్నాళ్లు ఉండేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. చదువు కోసం వచ్చిన కృష్ణచైతన్యకు.. రజిని-శ్రీనివాస్ల సంబంధం గురించి తెలిసింది.
![Life Imprisonment in Murder Case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-53-24-life-imprisonment-av-ts10011_24012022222916_2401f_1643043556_1051.jpg)
![Life Imprisonment in Murder Case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-53-24-life-imprisonment-av-ts10011_24012022222916_2401f_1643043556_832.jpg)
తన లైంగిక వాంఛ తీర్చకపోతే.. వారి గుట్టు రట్టు చేస్తానని రజినిని బ్లాక్మెయిల్ చేశాడు. అతని నుంచి వేధింపులు ఎక్కువవ్వడంతో ఈ విషయాన్ని రజిని... శ్రీనివాస్కు చెప్పింది. ఇద్దరు కలిసి కృష్ణచైతన్యను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చారు. 2013 ఆగస్టు 28 రాత్రి.. మద్యం సేవించి వచ్చిన కృష్ణ చైతన్యకు ఆహారంలో హైడ్రస్ పౌడర్ను కలిపి ఇచ్చింది రజిని. రసాయనం కలిపిన ఆహారం తిన్న కృష్ణ చైతన్య వాంతులు చేసుకుంటూ తెల్లవారుజామున చనిపోయాడు.
అతను మరణించాడని నిర్ధరించుకున్న రజిని-శ్రీనివాస్లు.. అతని మృతదేహాన్ని ఓ మూటలో కట్టి అక్కణ్నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో కృష్ణచైతన్య మృతి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. సోమవారం రోజున మేడ్చల్ కోర్టు ఈ కేసుపై తీర్పును వెలువరించింది. నిందితులిద్దరికి జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించింది.