అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదన్న మనస్తాపంతో మాజీ సైనికుడు బలవన్మరణానికి యత్నించిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కేసు నమోదైంది. 2019లో మండల పరిషత్తు ఎన్నికల సందర్భంగా కట్టంగూరు ఎంపీటీసీ సభ్యుడు మాద యాదగిరికి... మాజీ ఎమ్మెల్యే వీరేశం ప్రోత్సాహంతో రూ.10 లక్షలను రెండు విడతలుగా నకిరేకల్ వాసవీనగర్లో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు కొమ్ము కోటేశ్ అప్పుగా ఇచ్చారు.
ఆ అప్పును తిరిగి చెల్లించాలని పలు దఫాలుగా కోరుతున్నా యాదగిరి ఇవ్వడం లేదు. తన సొమ్మును ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యేను అడుగగా... ఆయన బెదిరించారని కోటేశ్ భార్య సంధ్య తెలిపారు. దీంతో కోటేశ్ మనస్తాపానికి గురై పురుగల మందు తాగి బలవన్మరణానికి యత్నించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మాద యాదగిరి, వేముల వీరేశంపై కేసు నమోదు చేశారు. బాధితుడు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయంపై అప్పు ఇచ్చిన మాజీ సైనికుడి భార్య సంధ్య మాజీ ఎమ్మెల్యే వీరేశం వద్దకు వెళ్లి ఇటీవల విషయం గుర్తు చేసింది. అయితే అప్పు ఇచ్చిన విషయం తనకు తెలియదని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారని ఆమె చెప్పింది. వీరేశం బెదిరించిన విషయాన్ని భర్తకు చెప్పడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపింది.