హెరాయిన్ సరఫరా చేస్తూ ఆదివారం పట్టుబడ్డ ఆఫ్రికా మహిళలు వారి దేశాల్లో రోడ్లపక్కన దుస్తులు అమ్ముకుంటూ పొట్టపోసుకునే వారని తేలింది. వీరికి డబ్బు ఆశచూపించిన ‘మత్తు వ్యాపారులు’ లగేజీ చేతిలో పెట్టి, విమాన టిక్కెట్లు కొనిచ్చి హైదరాబాద్ వెళ్లమన్నారు. ఈ లగేజీ ఎవరికి ఇవ్వాలో కూడా ఆ మహిళలకు తెలియదు. ఈ లోపే పట్టుబడ్డారు. మత్తుమందుల రవాణా వ్యవహారాల్లో ఎప్పటి నుంచో అసలు సూత్రధారులు అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని అధికారులు ఛేదించలేకపోతున్నారు.
![](https://assets.eenadu.net/article_img/story-2b_75.jpg)
మహిళలే పావులు
రూ.కోట్లల్లో జరిగే మత్తుమందుల వ్యాపారంలో ఉత్పత్తిదారులు, సరఫరాదారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మధ్యలో ఎవరైనా పట్టుబడ్డా అసలు సూత్రధారులు దొరక్కుండా ఏర్పాట్లు చేసుకుంటారు. ఉత్పత్తి అయిన దేశం నుంచి వినియోగ దేశానికి సరఫరా చేయడం కోసం మహిళలను పావులుగా వాడుకుంటారు. చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్న వారిని గుర్తించి అధికమొత్తంలో డబ్బు ఆశచూపుతారు. ఆదివారం పట్టుబడ్డ ఇద్దరు మహిళల ఉదంతమే ఇందుకు నిదర్శనం. వేర్వేరు దేశాలకు చెందిన ఈ ఇద్దరికీ మత్తుమందులు ఇచ్చి హైదరాబాద్ వెళ్లాలని పురమాయించిన ముఠా మాత్రం ఒకటే. తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సుమారు ఐదువేల డాలర్లు ఇస్తామని ఆశ చూపడంతో వారు ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, డబ్బు ఆశతో ఇలాంటి పనులను ఒప్పుకొంటున్న పాత్రధారులు.. తర్వాత ఏళ్లపాటు జైలు ఊచలు లెక్కించాల్సి వస్తోంది. ఈ వ్యవహారాల్లో సూత్రధారులు మాత్రం చాకచక్యంగా తప్పించుకుంటున్నారు.
కొన్ని ఉదాహరణలు..
- ఆరేళ్ల క్రితం దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన ముసాయి మూసా అనే మహిళ పొట్టలో నుంచి దాదాపు రూ.45 లక్షల విలువైన కొకైన్ను హైదరాబాద్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి.) అధికారులు పట్టుకున్నారు. 2015 సెప్టెంబరులో ఆమె పట్టుబడగా ఇప్పటి వరకూ బెయిలు లభించలేదు. త్వరలోనే శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది.
- 2010లో పింగ్కీ అనే థాయ్లాండ్ మహిళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి బ్యాంకాక్ వెళుతుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆమె వద్ద కొకైన్ పట్టుకున్నారు. ఆమెకు న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష విధించింది.
- ఆదివారం డీఆర్ఐ అధికారులు ఇద్దరు మహిళల నుంచి రూ.76 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
- ఇదీ చూడండి: Murder: వెనక కూర్చొని.. బండి నడుపుతున్న వ్యక్తి గొంతు కోసేశాడు.!