రాష్ట్ర రాజధానిలో మరో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ ఎల్బీనగర్లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆటోడ్రైవర్ సలీమ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఇటు ప్రజాసంఘాలు.. అటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల్ని బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. యువతులు కార్యాలయాలకు వెళ్లాలంటే వెనకా ముందు ఆలోచించాల్సిన స్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. మహిళ రక్షణ చట్టాలను పకడ్పందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్థానిక నేతలతో కలిసి పరామర్శించారు. రాష్ట్రంలో సీసీకెమెరాలు, షీ టీమ్స్ ఉన్నా మహిళలపై ఇంకా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.