తితిదే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి శ్రీవారి 1500 కిలోల బంగారు నగలను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టుపెట్టినట్లు జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో ఫేస్బుక్, ట్విటర్ ద్వారా పోస్టులు షేర్ చేశారని 18మందిపై తితిదే విజిలెన్స్ అధికారులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తితిదేకు చెందిన బంగారాన్ని ఏపీ ప్రభుత్వం ఎస్బీఐలో తాకట్టుపెట్టి అప్పు తెచ్చిందని.. మమ్మల్ని తర్వాత కాపాడుదురు కానీ.. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి స్వామీ.. ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవింద’ అంటూ భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో దుష్ప్రచారం చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో పాటు మరో 16 మంది ఈ దుష్ప్రచారం చేశారని అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని అధికారులంటున్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్ట్లు పెట్టి షేర్ చేయడం మంచిది కాదని తితిదే అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: శ్రావణ శనివారం స్పెషల్.. ఆలయాల్లో భక్తుల కిటకిట