మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు తలపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల పరిశీలన ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతల పర్యటన గురించి సమాచారం అందుకున్న దివిటిపల్లి గ్రామ తెరాస నాయకులు.. అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. దీంతో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటల మధ్యనే కాంగ్రెస్ నేతలు రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు.
ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న దివిటిపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నేతలతో వాదనకు దిగారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులను చూడడానికి కాంగ్రెస్ నేతలు రావద్దంటూ మండిపడ్డారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పన లేవని... అవి సమకూర్చిన తర్వాత లబ్ధిదారులకు అందజేయనున్నామని పేర్కొన్నారు.
రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఎందుకు అందచేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా హడావుడిగా ప్రారంభించిన ఇళ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులు అందించకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని మండిపడ్డారు. గత కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేసి.. జాబితా తయారు చేసినప్పటికీ రెండేళ్ల అయినా ఎందుకు అప్పగించలేదో సమాధానం చెప్పాల్సిన అవసరముందని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు దివిటిపల్లి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు.
ఇవీ చూడండి: గోడు వినకుండా.. పొట్ట కొట్టారు..!