మరో అంతర్జాతీయ వేడుకకు భాగ్యనగరం సిద్ధమైంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు హైదరాబాద్ నగరవాసులను కనువిందు చేయనున్నాయి. ఇందుకు బేగంపేట విమానాశ్రయం వేదిక కానుంది. ఈ మేరకు ఈ నెల 24 నుంచి 'వింగ్స్ ఇండియా-2022' పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ ప్రదర్శనల్లో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. 6 వేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఎయిర్ షోను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.