నాణ్యమైన పాలను నిత్యం పోసే రైతులకు సాధారణం కన్నా అధిక ధర చెల్లించాలని ‘రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య’ (విజయ డెయిరీ(Vijaya diary)) నిర్ణయించింది. నాణ్యమైన పాలను మాత్రమే డెయిరీకి పోసేలా రైతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) జి.శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం లాలాపేటలోని డెయిరీ కార్యాలయంలో సమాఖ్య ఛైర్మన్ లోకా భూమారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో పాడి రైతులకు పలు రకాల ప్రోత్సాహకాలను ఇవ్వాలని తీర్మానించారు.
రైతు పాడి పశువును కొంటే ధరలో రూ.10 వేలను రాయితీగా ఇస్తారు. బీమా ప్రీమియం కింద మరో రూ.100 చెల్లిస్తారు. ఉచితంగా కృత్రిమ గర్భధారణ సదుపాయం, రాయితీ ధరలకు దాణా ఇస్తారు. రైతు పిల్లల పెళ్లికి రూ.5 వేలు రైతు మరణిస్తే అంతిమ సంస్కారాలకు రూ.5 వేలు సాయం అందజేస్తారు. రైతుల పిల్లలు, టెన్త్, ఇతర పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తే నగదు ప్రోత్సాహకాలుంటాయి. నాణ్యమైన పాలు ఎక్కువ పోసే రైతుకు రూ.2116 బహుమతి ఉంటుంది. రోజుకు 1500 లీటర్లకు మించి పాలుపోసే అంకుర సంస్థ లేదా మినీ డెయిరీలకు పలు రాయితీలిస్తారు. మెగా డెయిరీ నిర్మాణానికి ఎన్డీడీబీకి రూ.25 కోట్లను అడ్వాన్స్గా చెల్లిస్తారు. డెయిరీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61కి పెంచి కొత్త పీఆర్సీసీ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు డెయిరీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.