కటికనేని సోదరుల అపహరణ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. అనారోగ్య పరిస్థితులు కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
పోలీసుల అభ్యంతరం..
బెయిల్ ఇవ్వొద్దని... అఖిలప్రియకు కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ చంచల్గూడ మహిళా జైల్లో ఉన్నాయని పోలీసుల తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని... తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు.
కస్టడీపై కూడా..
దర్యాప్తులో పురోగతి కోసం అఖిలప్రియను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పైన కూడా సికింద్రాబాద్ న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
ఇవీ చూడండి: విదేశాల్లోని అక్రమాస్తులపై దర్యాప్తునకు ప్రత్యేక విభాగం