ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ముగిసింది. అధికార వైకాపా అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎంపీపీ పదవికి ఒక్క బి-ఫామ్ మాత్రమే వచ్చిందన్న అధికారులు.. రూపవాణిని ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా తెదేపా సభ్యురాలు షేక్ జబీన్, రెండో ఉపాధ్యక్షురాలిగా జనసేనకు చెందిన పసుపులేటి సాయిచైతన్య ఎన్నికయ్యారు.
దుగ్గిరాలలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 9 చోట్ల తెదేపా గెలిచింది. వైకాపా 8 సీట్లు, ఒకచోట జనసేన విజయం సాధించాయి. అయితే ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్లలో బీసీ మహిళ ఒకరు మాత్రమే ఉండగా ఆమెకు సంబంధిత ధృవీకరణ పత్రం జారీ కాలేదు. ఈ పరిస్థితుల్లో వారు కోర్టుకు వెళ్లడంతో కొన్ని నెలల పాటు ఎన్నిక వాయిదా పడింది.
ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైకాపా నుంచి ఎంపీపీ పదవి ఆశించిన దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతి.... తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగాలని భావించారు. ఈ విషయాన్ని గుర్తించిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.... నిన్నే ఆమెను తనవెంట తీసుకెళ్లారు. ఇవాళ ఎన్నిక సమయానికి కూడా ఆమెను తీసుకురాలేదు. ఈ పరిస్థితుల్లో వైకాపా అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు: ముస్లిం మైనారిటీ మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కుట్రపన్నారని తెదేపా తరుఫున దుగ్గిరాల వైస్ఎంపీపీగా ఎన్నికైన షేక్ జాబీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులందరికీ బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు తాను ఏ విధంగా బీసీ కాకుండా పోతానాని ప్రశ్నించారు. నామినేషన్ దాఖలు నుంచి ఎన్నిక వరకు అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురిచేసిందని జనసేన తరుఫున వైస్ఎంపీపీగా ఎన్నికైన సాయి చైతన్య మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లకు అధిగమించి తాను వైస్ ఎంపీపీ దక్కించుకున్నానన్నారు.
ఇదీ చదవండి: Revnath reddy on KCR: నిజాం నవాబుల కంటే కేసీఆర్ కుటుంబమే సంపన్నం: రేవంత్రెడ్డి