ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో డ్రైవర్ కృష్ణారావుకు గుండె పోటు వచ్చినా.. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మరణించాడు.
తిరువూరుకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు.. డిపో నుంచి విజయవాడ బయలు దేరింది. మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలోకి రాగానే.. డ్రైవర్ కృష్ణకు ఛాతిలో నొప్పి వచ్చింది. బస్సును రోడ్డు పక్కకు తీసుకువెళ్లి ఆయన కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో కండక్టర్తో పాటు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.
మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రైవర్ కృష్ణారావు మృతి చెందాడు. ఆయన గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన వాడని తోటి కార్మికులు తెలిపారు. డిపో మేనేజర్ వేణు, ఇతర ఉద్యోగులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఆర్ఎం సందర్శనానంతరం మృతదేహాన్ని డ్రైవర్ గ్రామానికి తరలించారు.
ఇదీ చూడండి: చెరువులో మునిగి.. ముగ్గురు పిల్లలు మృతి