పంట పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు చెల్లించలేక అవస్థలు పడుతున్న రైతులు.. తమ బాధలు చెప్పుకుని పరిష్కారాలు పొందే ఏకైక వేదిక.. రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్ మూతపడింది. దీంతో అన్నదాతలు తమ రుణాల వేదనను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్న రైతులను అధిక వడ్డీలతో వేధిస్తూ వారి ఆస్తులను కాజేస్తున్నారు. అప్పుల బాధలతో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటివారిని వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడేందుకు ఈ కమిషన్ను హైకోర్టు ఆదేశాలతో 2018 మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడేళ్ల తరవాత ఈ కమిషన్ను అవసరమైతే కొనసాగిస్తామని అప్పుడు ఇచ్చిన ఉత్తర్వులో తెలిపింది. అప్పుడు నియమితులైన కమిషన్ ఛైర్మన్, సభ్యుల మూడేళ్ల పదవీకాలం గత మార్చి 12న ముగియడంతో వారు మాసాబ్ట్యాంకులోని సమాచారశాఖ భవన్లో గల కార్యాలయానికి రావడం మానేశారు. తమ పదవీకాలం పొడిగించాలని వారు ప్రభుత్వానికి సైతం విన్నవించినా అనుమతి రాలేదు. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకున్న అనేక మంది ఈ కార్యాలయానికి ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.
ఉపశమనం ఎలా..?
మూడేళ్ల పదవీకాలంలో కమిషన్ ఛైర్మన్, సభ్యులకు రైతుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి. వాటిని పరిష్కరించి అప్పుల భారం నుంచి ఉపశమనం కలిగించేలా తీర్పులిచ్చారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులే కాకుండా కొన్నిచోట్ల ప్రభుత్వ బ్యాంకులు సైతం అధిక వడ్డీలతో అప్పులు చెల్లించాలని వేధిస్తుండటంతో ఈ కమిషన్ను ఆశ్రయించి న్యాయం పొందారు. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి న్యాయమైన వడ్డీతో తిరిగి చెల్లించేలా పరిష్కారం చూపే కమిషన్ లేకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.
కోర్టులకెళితే ఏళ్ల తరబడి కేసులు తేలడం లేదని, ఈ కమిషన్కు ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే వ్యాపారులను పిలిపించి విచారణ జరిపి తీర్పులిచ్చినట్లు సభ్యుడిగా పనిచేసిన పాకాల శ్రీహరిరావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారులు రైతులకు అప్పులిచ్చి వారి ఆస్తులను కాజేస్తున్నట్లు తమ విచారణల్లో అనేకసార్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రధానంగా కౌలు రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కవడంతో వారిని వడ్డీ వ్యాపారులు పెద్దయెత్తున మోసం చేస్తున్నారని, ఒకసారి అప్పు తీసుకుంటే దాని నుంచి ఎప్పటికీ బయటపడనంతగా వడ్డీల భారం మోపి మోసగిస్తున్నారని ఆయన వివరించారు. కమిషన్ ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుందన్నారు.