రాష్ట్రంలో వ్యాక్సినేషన్ 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విద్యాసంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో టీకాలు పూర్తి చేయాలని చెప్పింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది. మొత్తం పరీక్షల్లో 10 శాతమే ఆర్టీపీసీఆర్ జరుగుతున్నాయని.. ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా? అంటూ ఘాటుగా స్పందించింది.
తమ ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చకపోవడంపై కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమంది మరణించాక చేరుస్తారని ప్రశ్నించింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Opposition parties Maha Dharna: ఇందిరాపార్కు వద్ద మహాధర్నా... సాగు చట్టాలు, పెట్రో ధరల పెంపుపై నిరసన