ChandraBabu Kuppam Tour : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నేటి నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు.. రోడ్డు మార్గంలో హోసూరు, కృష్ణగిరి మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు దేవరాజపురం చేరుకుంటారు. అక్కడి నుంచి రామకుప్పం మండలం ఆరిమానుపెంట, వీర్నమల, గట్టూరు, ననియాల, నారాయణపురం తాండ, సింగసముద్రం కెంచనబల్ల గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఆరిమానుపెంటలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటలకు కుప్పం చేరుకుని, రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహంలో బస చేస్తారు.
Chandrababu Kuppam Tour Today : శుక్రవారం అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గ ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరిస్తారు. అనంతరం కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం గ్రామీణ మండలంలో దాసేగానూరు, గుట్టపల్లి, కొత్త ఇండ్లు, చందం, నూలుకుంట, వేపూరు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. మూడో రోజు శనివారం గుడిపల్లి మండలం శెట్టిపల్లి, జాతకర్తపల్లిలో పర్యటించి మునీశ్వర దేవాలయంలో జరిగే పూజల్లో పాల్గొంటారు. శాంతిపురం మండలం వెంకటాపురం, సోమాపురం, చిన్నూరు, సి.బండపల్లి, 64 పెద్దూరు, గెసికపల్లి, సోలిశెట్టిపల్లి తదితర గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తారు.