SLBC Loan plan for Telangana : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.2,14,041 కోట్ల రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ ఆమోదించింది. గత ఏడాది కంటే 15 శాతం అధికంగా రుణాలను ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,01,030 కోట్ల రుణాలను అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లో ఎస్ఎల్బీసీ ఛైర్మన్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ నేతృత్వంలో ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డ్ సీజీఎం వై.కె.రావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ క్రిషన్శర్మతో పాటు ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణప్రణాళికను ఆమోదించారు. గత ఏడాది రూ.1,85,035 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించగా ప్రాధాన్యరంగ రుణాలను పెంచుతూ 15 శాతం అదనపు మొత్తంతో ఈ ఏడాదికి రుణ ప్రణాళికను ఆమోదించారు. ప్రాధాన్యరంగ రుణాల్లో వ్యవసాయ రంగం రుణాల వాటా 61 శాతంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు పదిశాతం పెరిగినట్లు తెలిపారు.
కోటి దాటిన జన్ధన్ ఖాతాలు..
గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయ పంట రుణాలు రూ.42,813 కోట్లు అందించినట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ పెట్టుబడి రుణాలుగా రూ.17,535 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.45,105 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రూ.6,167 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎంజేడీవై) ఖాతాలు కోటి దాటినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1.04 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు ఉండగా వీటిలో 86.63 లక్షల ఖాతాలు ఆధార్సంఖ్యతో అనుసంధానం చేయగా 83.71 లక్షల రూపేకార్డులను అందించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ అభియాన్ ద్వారా రూ.7716 కోట్ల రుణాలను అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి కింద 3.44 లక్షల మందికి రుణాలు ఇచ్చినట్లు వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద నాలుగేళ్లలో రూ.3,075 కోట్లు అందించాలని లక్ష్యం కాగా రెండేళ్లలో రూ.403 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
![](https://assets.eenadu.net/article_img/140622gh-main38b.jpg)
ఇదీ చదవండి : హుస్నాబాద్లో మళ్లీ ఉద్రిక్తత.. ప్రజాప్రతినిధులపై దాడి.. పోలీసుల లాఠీఛార్జ్