మన సెల్ఫోన్ సంభాషణలు.. వేడుకల వీడియోలు.. బ్యాంకు ఖాతాలు.. పిన్ నంబర్లు అన్నీ మన వద్దే రహస్యంగా ఉంటాయనుకుంటే పొరపాటే.. పెగాసుస్ స్పైవేర్ అనే సాఫ్ట్వేర్ను ఫోన్లోకి పంపితే చాలు.. మనమేం చేస్తున్నామో క్షణక్షణం సైబర్ నేరస్థులకు తెలిసిపోతుంది. ఈ స్పైవేర్ను అత్యంత సూక్ష్మంగా ఉండే బాట్స్ రోబోల ద్వారా హ్యాకింగ్ చేయాలనుకున్న ఫోన్కు పంపుతారు. ఇజ్రాయెల్లోని ఎన్ఎస్వో సంస్థ ప్రతినిధులు పెగాసుస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలకు మాత్రమే అందిస్తున్నారు. అయితే, ఆరేడు నెలల నుంచి వాట్సాప్ ద్వారా ఈ స్పైవేర్ను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల ఫోన్లలో ప్రవేశపెట్టారన్న సమాచారం నిఘా వర్గాలకు తెలియడంతో రహస్యంగా కూపీ లాగుతున్నారు. వీరితోపాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ప్రతినిధుల ఫోన్లు ఏవైనా హ్యాక్ చేశారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
ఒక్క సంక్షిప్త సందేశం..
సదరు సెల్ఫోన్ వాడుతున్న వ్యక్తి ఏ నెట్వర్క్ను ఉపయోగిస్తున్నాడో తొలుత సైబర్ నేరస్థులు తెలుసుకుంటారు. తర్వాత హ్యాకర్లు అదే నెట్వర్క్ నుంచి సిమ్కార్డును తీసుకుంటారు. ఈ సిమ్కార్డు ద్వారా సెల్ టవర్ ద్వారా బాట్స్ రోబోలను పంపుతారు. వెబ్ ఆధారిత పరిజ్ఞానంతో పనిచేసే ఈ బాట్స్ రోబోలు నిర్దుష్ట సెల్టవర్ ద్వారా ఎంపిక చేసిన సెల్ఫోన్కి ‘సీక్రసీ’ అంటూ అతడు వినియోగిస్తున్న నెట్వర్క్ ద్వారా పంపించినట్టే సంక్షిప్త సందేశాన్ని పంపిస్తాయి. ఆ సందేశాన్ని చదివి లింక్ క్లిక్ చేసిన క్షణాల్లోనే బాట్స్ రోబోలు సెల్ సాఫ్ట్వేర్లోకి చొరబడతాయి. సెల్ వినియోగదారుడు చేసే పనులు రోబోలు పసిగడుతుంటాయి. సైబర్ హ్యాకర్లు కొద్దిరోజుల క్రితం ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి పెగాసుస్ స్పైవేర్ను రూ.15 లక్షలకు అందిస్తామంటూ వాట్సాప్ద్వారా సంభాషించారని తెలిసింది. వీటిపై ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: భారీ వర్షం కురిసిన.. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా..