సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇక నుంచి ఔషధ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థలు, తయారీ రంగ పరిశ్రమలు, ఆస్పత్రులు కూడా ఎస్సీఎస్సీలో భాగస్వామ్యం కానున్నాయి. ఎస్సీఎస్సీ బృందంతో ఔషధ పరిశ్రమల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే భాగస్వామ్యమైన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఔషధ పరిశ్రమలు పాలుపంచుకోటానికి సుముఖత వ్యక్తం చేశాయి.
ఈ మేరకు ఔషధ పరిశ్రమలకు చెందిన సీఈఓలు ఎస్సీఎస్సీ ఛైర్మన్ సజ్జనార్, ప్రధాన కార్యదర్శి కృష్ణతో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఔషధ పరిశ్రమల చుట్టూ మరింత భద్రత ఏర్పాటు చేయాలని సంస్థల సీఈఓలు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ప్రధాన రహదారుల నుంచి పరిశ్రమల వరకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, గస్తీ పెంచాలని, పారిశ్రామిక వాడల్లో పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలని ఔషధ పరిశ్రమల ప్రతినిధులు కోరారు. ఎస్సీఎస్సీ చేపట్టే సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటామని ఔషధ రంగ సీఈఓలు తెలిపారు.