రాష్ట్ర ప్రజలకు శుభవార్త - అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - Indiramma Housing Scheme oct 02 - INDIRAMMA HOUSING SCHEME OCT 02
Indiramma Housing Scheme in Telangana : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు మరో వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించనున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.


Published : Sep 24, 2024, 2:21 PM IST
Minister Ponguleti on Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అక్టోబరు 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందుకు వారం రోజుల్లో విధివిధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను అర్హులకు అందించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్కార్డులు పంపిణీ ప్రక్రియ చేయనున్నట్లు తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలను అధికారులు ఇంకా ఇవ్వలేదని ఆగ్రహించారు.
వెంటనే వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలను, వాటి ప్రతిపాదనలు వెంటనే పంపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అటవీశాఖ అభ్యంతరాలతో అసంపూర్తిగా ఉన్న రహదారులను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని అటవీశాఖ అధికారులు మంత్రి సూచనలు చేశారు. ఏజెన్సీ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు జితీశ్ వి పాటిల్, అద్వైత్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపికే సవాల్ : ఒక్కో ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ఐదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. కానీ వచ్చిన అర్జీలే 82.82 లక్షలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్గా మారింది. ఈ క్రమంలో అధికారులు జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వం సూచనల మేరకు ముందడుగు వేయాలని భావించారు.
అధ్యయనానికి బృందాలు : రాష్ట్రం ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలని ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ను ప్రారంభించింది. ఈ పథకం అమలు చేసేందుకు వివిధ రాష్ట్రాలకు గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను అధ్యయనం చేసేందుకు ఓ బృందాన్ని పంపిన విషయం తెలిసిందే. ఇందుకు తెలంగాణ సర్కార్ ఇచ్చిన ఆమోదం మేరకే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఆ బృందం వెళ్లింది. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంతో పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నారు.