రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సకాలంలో వేతనాలు చెల్లించేందుకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్సీఐ కోడ్ మరోసారి పరిశీలించి నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచించింది.
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాల బిల్లులు పంపించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాలు ఫారం-58 కింద గ్రాంట్ల నుంచి చెల్లిస్తోంది. ఈ ఫారం కింద ఇచ్చేవాటిని ఉద్యోగుల వైద్య, ఇతర బిల్లులు, సప్లిమెంటరీ బిల్లుల కింద పరిగణిస్తారు. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు ఖజానాల్లో ప్రాధాన్యమివ్వడం లేదు. అత్యవసర బిల్లులు ఉన్నప్పటికీ ఉద్యోగుల వేతనాల చెల్లించాకే వాటిని పరిశీలిస్తారు. దీంతో జేపీఎస్లకు వేతనాలు ఆలస్యమవుతున్నాయి.
మరోవైపు గత రెండునెలలుగా పంచాయతీ కార్యదర్శులకు జీతాలు నిలిచిపోయాయి. వేతనాలు చెల్లించేందుకు నిధులు మంజూరైనా జీతాలు రాలేదని ఆవేదన చెందుతున్నారు. కొత్త విధానంలో ఇతర ఉద్యోగులతో పాటు వేతనాలు అందే అవకాశముందని పంచాయతీ వర్గాలు చెబుతున్నాయి.