వైద్య పరికరాల తయారీలో ప్రఖ్యాత సంస్థ మెడ్ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా అవతల తన రెండో అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్గా ఏర్పడే అవకాశాలు హైదరాబాద్ నగరానికి ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, మెడ్ట్రానిక్స్ కంపెనీ గత రెండేళ్లుగా ఇందుకు సంబంధించిన చర్చలను కొనసాగిస్తున్నాయి. 2016లో అమెరికాలో పర్యటించిన సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బృందం.. మెడ్ట్రానిక్స్ ఛైర్మన్ ఓమర్ ఇస్రాక్తో సమావేశమైంది. ఇవాళ ఆ సంస్థ ఛైర్మన్తో కేటీఆర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పెట్టుబడికి సంబంధించి కంపెనీ ప్రకటన చేసింది.
కేటీఆర్ హర్షం..
మెడ్ట్రానిక్స్ కంపెనీ తన అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రానికి గమ్యస్థానంగా హైదరాబాద్ను ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: నీటిపారుదల రంగం ఇకపై జలవనరుల శాఖ: కేసీఆర్