నూతన విద్యాసంవత్సరంలో పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తలెత్తనుంది. వేలాది మంది బోధన వృత్తికి దూరం కానున్నారు. కరోనా కారణంగా అనేక విద్యాసంస్థలను అర్ధాంతరంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఫీజులు వసూలు కాలేదని అనేక పాఠశాలలు మార్చి తర్వాతి నుంచి జీతాలిచ్చేది లేదనడంతో వందల మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఉద్యోగం మానేశారు.
తక్కువ వేతనాలు..
ఎక్కువ పని గంటల కారణంగా పనిభారంతో సతమతమవుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు కరోనా పరిస్థితుల్లో బోధన వృత్తిని వదిలి.. ఇతరత్రా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే రెండు నెలల వేతనం ఇవ్వకపోవడం.. వచ్చే ఏడాది ఆన్లైన్ పాఠాలు, షిఫ్టు విధానం తదితర కారణాల వల్ల మరింత పని భారం పెరుగుతుందని భావిస్తున్నారు. యాజమాన్యాలు ప్రతినెలా సకాలంలో వేతనాలు ఇవ్వరని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ఇంట్లో మరో సంపాదన ఉంటే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళలు ఉద్యోగాలు వదులుకుంటున్నారు.
హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన మహిళ తన ఇంటి దగ్గర్లోని ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్లుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త ఓ చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నారు. తాజాగా మహిళ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వీలుంటే ఇతర కొలువు.. లేదంటే ఈ ఏడాది ఇంటి వద్దే ఉండాలని నిర్ణయించుకున్నారు.హైదరాబాద్ తుక్కుగూడలోని వేర్వేరు ప్రైవేట్ పాఠశాలల్లో భార్యాభర్తలు ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా ప్రస్తుతం భార్య ఉద్యోగం మానేశారు. మరేదైనా కొలువు చేయాలని నిశ్చయించుకున్నారు. వారిద్దరికీ పాఠశాలల యాజమాన్యాలు మార్చి నుంచి జీతాలివ్వడం లేదు. కరోనా నేపథ్యంలో సరిగ్గా వేతనాలు ఇస్తారో? లేదో? అన్న అనుమానంతో ఆమె టీచర్ కొలువు వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు.
సంఘాలు ఏమంటున్నాయంటే...
* ‘అమెరికాలో కరోనా తర్వాత ప్రతి అయిదుగురి ఉపాధ్యాయుల్లో ఒకరు కొలువు మానేస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక్కడా 10-15 శాతం మానుకుంటారని అంచనా వేస్తున్నాం’ అని ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ఇస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్రాజు చెప్పారు.
* కనీసం 5 శాతం మంది మానుకోవడానికి అవకాశం ఉందని, వారిలో అత్యధికంగా మహిళలు ఉంటారని ట్రస్మా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు.
* ప్రస్తుత పరిస్థితుల్లో వందలాది మంది టీచర్లు తమ వృత్తులను మార్చుకుంటున్నారని.. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
* ప్రైవేట్ పాఠశాలలు: సుమారు 11,500
* వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు: 2 లక్షలకు పైనే (విద్యాశాఖ లెక్కల్లో 1.05 లక్షలే)
* మహిళా ఉపాధ్యాయుల సంఖ్య: కనీసం 1.50 లక్షలు (75-80 శాతం)
* ఎక్కువ మందికి నెల జీతం: రూ.6000 నుంచి రూ.40000 వరకు
* కరోనా పరిస్థితుల్లో: అధిక శాతం పాఠశాలలు మార్చిలో సగం వేతనమే ఇచ్చాయి. ఏప్రిల్లో అసలే లేదు
ఇవీ చూడండి: ఒప్పంద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు మరోసారి అవకాశం