రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు 'స్పీకప్ తెలంగాణ' పేరుతో సామాజిక మాద్యమ ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స అందించడంలో ప్రభుత్వ తీరుకు నిరసన కార్యక్రమంలో భాగంగా పార్టీ ముందుకెళ్లనుంది. ఈనెల 18 ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 'స్పీకప్ తెలంగాణ' కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని.. రెండు నిమిషాలు వీడియోను సామాజిక మాద్యమాల్లో అప్లోడ్ చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పీసీసీ స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కొవిడ్ నిర్ధరణ పరీక్షల నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడింది. చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్ రేటు అధికంగా ఉందని, కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని పీసీసీ విమర్శిస్తోంది.
మరొక వైపు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు రెండు వారాలపాటు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆరోపిస్తోంది. అనంతరం.. ప్రగతిభవన్కు వచ్చిన ముఖ్యమంత్రి వ్యవసాయంపై సమీక్షించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించడం లేదని ఆరోపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక బిల్లులు చెల్లించలేక విలవిలలాడుతున్నారని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై సామాజిక మాద్యమ వేదికగా గళమెత్తాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
'స్పీకప్ తెలంగాణ' కార్యక్రమం కరపత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్రెడ్డి విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లు..
- తెల్లరేషన్ కార్డులు కలిగిన వారికి ఆరోగ్యశ్రీ కింద కొవిడ్ చికిత్స అందించాలి.
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఛార్జీలను నియంత్రించాలి.
- పడకల పర్యవేక్షణ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి.
- ఐసోలేషన్ కోసం హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లోని హోటళ్లలో 50 శాతం గదులను ప్రభుత్వం తీసుకోవాలి.
- కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్యను పెంచాలి.
- ఆక్సిజన్, వైద్య పరికరాలు సమకూర్చుకోవడానికి తగిన నిధులు కేటాయించాలి.
- కరోనాతో మరణించిన వారికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలి.
- కొవిడ్ బారిన మరణించిన వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పాత్రికేయులకు రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలి.
ఇవీచూడండి: తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా కేసులు, 10 మంది మృతి