రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కట్టడికి చర్యలు చేపట్టాలని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కరోనా నివారణకు పాటుపడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ని కాపాడుకుంటూనే పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందేట్లు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తోంది. ఐసీఎంఆర్ నియమావళిని అనుసరించి కరోనా పరీక్షలు చేయడం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ చేస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేనందున... సరైన వైద్యం అందడం లేదని, అక్కడికి వెళ్తున్న రోగులకు భరోసా కల్పించలేని దుస్థితి నెలకొందని ఆరోపణలు చేస్తోంది.
ప్రైవేటు దోపిడి
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. అక్కడ రోగికి ఏ చికిత్స చేస్తున్నారో దాచడం, చనిపోయిన తరువాత కూడా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నా... నియంత్రించే యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదని విమర్శిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్ని పడకలు ఉన్నాయో... సమాచారం సక్రమంగా లేకపోవడం, పాజిటివ్ వచ్చినవారు ఆత్రుతతో వైద్యం కోసం ఆసుత్రులకు వెళ్తే చేర్చుకోకుండా... వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించడం వల్ల... ఈ లోపు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కరోనా విషయంలో... రాష్ట్ర ప్రభుత్వ విధానంలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వం ఒత్తిడి పెంచేలా ముందుకెళ్తున్నారు.
మంగళవారం కురిసిన వర్షం నీరు ఏకంగా ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు చికిత్స పొందుతున్న వార్డుల్లోకి రావడం పెద్ద దుమారం రేపింది. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నేతలు సందర్శించి ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోశారు. హెరిటేజ్ బిల్డింగ్గా పేర్కొంటున్న ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టి, కొత్తది కట్టడాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పక్కన ఖాళీ స్థలంలో కొత్త ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్లనే ఇవాళ ఈ దుస్థితి నెలకొందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు.
కరోనా టైంలో ఇదేంటి?
కరోనాతో ప్రజలు చనిపోతుంటే... ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మనుషుల ప్రాణాల ముఖ్యం కాదా అని నిలదీస్తున్నారు. కరోనా గురించి ప్రత్యేక దృష్టిసారించి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్... సచివాలయం కూల్చివేత, హరితహారంపై సమీక్ష చేయడం అవసరమా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ప్రతినిధుల రక్షణకు మరింత చిత్తశుద్ధితో వ్యవహరించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
స్పీక్ అప్ తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న " స్పీక్ అప్ తెలంగాణ" పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది.
ఇదీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు పచ్చ జెండా