ప్రజలకు విద్య, వైద్యం వంటి హక్కులను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని మండిపడ్డారు. కరోనా మందుల కొరత ఏర్పడిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఇంతవరకు అమలుకు నోచుకోలేదని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్ను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి..
ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని జీవన్రెడ్డి సూచించారు. అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడ్డ పేదలకు.. సీఎం సహాయ నిధి నుంచి పూర్తిగా బిల్లులు చెల్లించాలని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సూచించారు. అందరికీ ప్రభుత్వమే కరోనా టీకాను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఎన్నికలు అవసరమా?
కరోనా ఇంత తీవ్రంగా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియడం లేదా.. అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో మినీ పురఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం భేషజాలకు పోకుండా వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: 'ఆక్సిజన్, టీకాలు, రెమ్డెసివిర్ విషయంలో కేంద్రం వివక్ష'