పదికాలాల పాటు నిలిచి ఉండే తెలంగాణ సచివాలయంను పటిష్టమైన రీతిలో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయ పనుల పురోగతిని పనులను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆయన... అనంతరం ప్రగతి భవన్లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. రాజస్థాన్ నుంచి వచ్చిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను పరిశీలించారు. సచివాలయ నైరుతి ప్రాంతంలో కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో వున్న పిల్లర్లను, బీమ్ల నాణ్యతను పరిశీలించి.. నిర్మాణాల్లో చేపట్టవలసిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని నిర్మించాలని అన్నారు.
దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా సచివాలయం నిలవాలని, ఉద్యోగులకు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేయాలని... పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న మాదిరి ధోల్పూర్ స్టోన్తో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో కొత్త సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులను షాపూర్ పల్లోంజీ చేపడుతోంది. 617 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇటీవలే మంత్రి ప్రశాంత్ రెడ్డి సచివాలయ నిర్మాణానికి సర్వహంగులు సమకూర్చేలా దిల్లీ పార్లమెంట్ భవనం, తాజ్మహల్ తదితర ప్రాంతాలను సందర్శించారు. అక్కడ ఉపయోగించిన రాళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రాజస్థాన్లోని కొన్ని క్వారీలకు వెళ్లిన మంత్రి ప్రశాంత్రెడ్డి... సచివాలయ నిర్మాణంలో ఎర్రరాయి ఉపయోగించేందుకు పరిశీలించారు.