రెడ్జోన్ మండలంగా ప్రకటించినప్పటికీ కంటైన్మెంట్ జోన్ బయట ఉన్నందున కృష్ణపట్నం పోర్టు, అక్కడున్న విద్యుత్ ప్లాంట్లు, వంటనూనె తయారీ యూనిట్లను తెరవడానికి ఏపీ ముఖ్యమంత్రి ఆదేశాలనిచ్చారని ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రీన్జోన్ పరిధిలో వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన ఉత్పత్తుల రవాణా, విక్రయాలకు అనుమతినిచ్చారని పేర్కొన్నారు. మల్టీ బ్రాండ్, సింగిల్స్ బ్రాండ్ మాల్స్ మినహా విడిగా ఉండే దుకాణాలను తెరవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపారు. నగర ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సర్వీసులు అందించాలనేది కలెక్టర్లు, ఎస్పీలు, పురపాలక కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపారు. వీటికి బయట ఉన్న ప్రాంతాల్లో విడిగా ఉండే దుకాణాలు, నివాస ప్రాంతాలుండే దుకాణాలను తెరవడానికి అనుమతి ఉందన్నారు.
బీమా, కొరియర్, నాన్బ్యాంకింగ్ సర్వీసులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవి రెడ్జోన్ పరిధిలో ఉన్నా కనీసం ఒక కార్యాలయం తెరవడానికి అనుమతినివ్వాలని నిర్ణయించింది. సినిమా థియేటర్లు, షాపింగ్మాల్స్, విద్యాసంస్థలు, ప్రజారవాణాకు అనుమతి లేదు’ అని తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు గ్రీన్జోన్లో ఉన్న ఏ ప్రాంతంనుంచైనా వాహనాల్లో 40శాతం భర్తీతో కార్మికులను తెప్పించుకుని వినియోగించుకునేలా ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారన్నారు.
ఇవీ చదవండి...పిడికిలెత్తే చేతులు.. పిడికెడన్నానికి చాస్తూ..