అరవై ఏళ్లలో కాంగ్రెస్ చేసిన పనిని మోదీ ఆరేళ్లల్లో చేసి చూపించారని భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం మాటను.. వాళ్ల ముఖ్యమంత్రులే వినటంలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి.. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు భాజపా వర్చువల్ ర్యాలీలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే శనివారం తెలంగాణ జన్ సంవాద్ పేరుతో వర్చువల్ ర్యాలీని చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుతో కలిసి జేపీ.నడ్డా ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. దిల్లీలోని జాతీయ కార్యాలయం నుంచి యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ల ద్వారా నడ్డా ప్రసంగించారు.
కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది.
కరోనాను నివారించటంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని... ఇందుకు యువ జర్నలిస్ట్ మృతే ఉదాహరణ అని నడ్డా అన్నారు. చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ చేసినన్ని పరీక్షలు తెలంగాణ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. కొవిడ్ వ్యతిరేక పోరాటంలో తెలంగాణ భాజపా కార్యకర్తలు ముందున్నారని తెలిపారు. జీ20 దేశాల సదస్సు ఏర్పాటుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. సంక్షోభ సమయంలో సైనికుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ కించపరుస్తోందని మండిపడ్డారు. పేదల జీవితాల్లో ఆత్మ నిర్భర్ ప్యాకేజీ వెలుగులు నింపిందని స్పష్టం చేశారు. గల్వాల్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు శ్రద్ధాంజలి ఘటించిన నడ్డా.. జవాన్లకు 130 కోట్ల భారతీయుల మద్దతు ఉందన్నారు.
డేంజర్ జోన్లో హైదరాబాద్..
కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో భాజపా పాత్ర కీలకమైనదని తెలిపారు. ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలోనే కరోనా విషయంలో హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందని తెలిపారు. 4.14 లక్షల ఎన్95 మాస్కులు, 2.31 లక్షల పీపీఈ కిట్లను కేంద్రం నుంచి తెలంగాణకు పంపించామని చెప్పారు. కరోనా కట్టడిలో తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు..
ఒకవైపు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే.. సీఎం కేసీఆర్ విచిత్రమైన వ్యవహారశైలి వల్ల ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మోడీ దేశాన్ని కరోనా బారిన నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుంటే.. సీఎం కేసీఆర్ వ్యవహార శైలి వల్ల ప్రజలంతా కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు జోకర్లుగా మారారని ఎద్దేవా చేశారు.