బయలాజికల్ సిస్టమ్స్, జీవులు, వాటి నిర్మాణాలను సాంకేతికతను ఉయోగించి మానవ అభివృద్ధికి తోడ్పడే వాటిని రూపొందించడమే బయోటెక్నాలజీ ఉద్దేశం. ఇదో మల్టీ డిసిప్లినరీ విభాగం. ఈ విభాగంలో సుశిక్షితులైన నిపుణులకు డిమాండు పెరుగుతోంది. ఫరీదాబాద్లోని రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్సీబీ) గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్- బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) ప్రకటనను విడుదల చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గుర్తింపు పొందిన 62 బయోటెక్నాలజీ, దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి దీన్ని నిర్వహిస్తారు. ప్రవేశపరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో అందుబాటులో ఉన్న 1221 సీట్లను భర్తీ ప్రవేశం కల్పిస్తారు.
అంతకుముందు దీనిని జేఎన్యూ కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయోటెక్నాలజీ (సీఈఈబీ)గా నిర్వహించేది. ఇప్పుడు ఆర్సీబీ గ్యాట్/ జీఏటీ-బీ పేరిట నిర్వహిస్తోంది. కోర్సుల్లో ప్రవేశం పొందినవారికి స్టైపెండ్ను కూడా చెల్లిస్తారు.
- ఎంఎస్సీ బయోటెక్నాలజీ, అనుబంధ విభాగాల వారికి నెలకు రూ.5000
- ఎంఎస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ వారికి నెలకు రూ. 7500
- ఎంటెక్/ ఎంవీఎస్సీ ప్రోగ్రామ్ల వారికి నెలకు రూ.12,000 చొప్పున చెల్లిస్తారు. స్టైపెండ్ కొనసాగింపు మొదటి ఏడాది ప్రతిభాప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.
పరీక్ష విధానం
కాలవ్యవధి 3 గంటలు. ఆన్లైన్లో నిర్వహిస్తారు. రెండు సెక్షన్లు- ఎ, బి ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. సెక్షన్-ఎలో పన్నెండో తరగతి స్థాయి సబ్జెక్టులు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్, బయాలజీల నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి అర మార్కు కోత ఉంటుంది. సెక్షన్-బిలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి విశ్లేషణాధారిత ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా బేసిక్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, అనుబంధ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికీ 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత ఉంటుంది.
కోర్సులు- అర్హతలు
మొత్తంగా 62 రకాల పీజీ కోర్సులు ఈ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.
- ఎంవీఎస్సీ యానిమల్ బయోటెక్నాలజీ డిగ్రీ స్థాయిలో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ను గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేసినవారు అర్హులు. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీవారు 50% సాధించి ఉండాలి.
- ఎంటెక్ బయోటెక్నాలజీ/ అనుబంధ కోర్సులు సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ డిగ్రీని 60శాతం మార్కులతో పూర్తి చేసుండాలి.
- ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, అనుబంధ కోర్సులు బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ అగ్రి బయోటెక్నాలజీ/ ఫారెస్ట్రీ/ బయోఇన్ఫర్మాటిక్స్/ సెరీకల్చర్/ మైక్రోబయాలజీ/ బయాలజీ)ని కనీసం 55% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు.
దరఖాస్తు ఇలా..
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబరుతో నమోదు చేసుకోవాలి. నమోదు ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ఆపై అడిగిన ధ్రువపత్రాలు- ఫొటో, సంతకం, డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్, విద్యార్హత పత్రాలు, ఆధార్ మొదలైనవాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ వారికి రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులకు రూ.500. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలన్నింటిలోనూ పరీక్ష కేంద్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నాల్లో ఉన్నాయి.
- దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జూన్ 18, 2020
- అడ్మిట్కార్డ్లు అందుబాటులోకి వచ్చేది: జూన్ 25, 2020
- పరీక్ష తేదీ: జూన్ 30, 2020
- వెబ్సైట్: https://rcb.res.in/GATB/
- ప్రవేశపరీక్ష పూర్తి సిలబస్, కళాశాలలు, మాదిరి ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!