యూరియా పంపిణీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో జిల్లాల నుంచి సమగ్ర నివేదికలు తెప్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా వ్యవసాయ అధికారుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రబీ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా... రాయితీ విత్తనాలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాల సరఫరాపై వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి సమీక్షించారు. ఖరీఫ్ కాలంలో కొన్నిజిల్లాల్లో ఉత్పన్నమైన యూరియా కొరత, సరఫరాలో లోపాలు, రైతుల ఇబ్బందులు, ఇతర నిర్లక్ష్యాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గత ఖరీఫ్ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని యాసంగిలో ఎక్కడా యూరియా సహా రాయితీ విత్తనాల కొరత రాకుండా ఇప్పటి నుంచే పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి... డీఏఓలకు సూచించారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలతో సిద్ధం చేసుకుని ముందుకు సాగనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకనుంచి భూసారం పెంపుపై రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెను ప్రజల్లోకి తీసుకెళ్లండి: లక్ష్మణ్