ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో దారుణం చోటుచేసుకుంది. 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మండలంలోని ముచ్చిందర గ్రామానికి చెందిన సాడీ తులసమ్మ బుధవారం పాము కాటుకు గురైంది. స్పందించిన స్థానికులు వెంటనే ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించాలని వైద్యులు సూచించారు. ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రిలోని అంబులెన్స్ కొవిడ్ రోగులను తరలించేందుకు వినియోగిస్తున్నామని చెప్పటంతో బాధితురాలి బంధువులు 108కి ఫోన్ చేశారు. దాదాపు 2 గంటల తరువాత కవిటి నుంచి ఇచ్ఛాపురానికి అంబులెన్స్ వచ్చింది.
సిబ్బంది వాగ్వాదం
కవిటి నుంచి ఇచ్ఛాపురం ఆసుపత్రికి వచ్చిన 108 అంబులెన్స్లోని సిబ్బంది... ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న 108 సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీనివల్ల మరో గంట సమయం వృథా అయింది. చివరికి బాధితురాలిని 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. 108 సిబ్బంది నిర్లక్యం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందని.. బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివాస్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
ఇవీచూడండి: ఏపీ: ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన సీఐ