ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు క్రెడిట్ సపోర్ట్ను పొడిగించడం మాత్రమే చాలదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల దేశం ఇప్పటికే చాలా సమయం కోల్పోయిందని ప్రముఖ ఆర్థికవేత్త సంతోష్ మల్హోత్రా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే.. దేశ జనాభాలో కనీసం 40 శాతం మందికి కేంద్రం నగదు సహాయం అందించాలన్నారు.
'ఇప్పటికే చాలా సమయం కోల్పోయాం. బడ్జెట్లోనైనా ప్రజా వ్యయాలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది' అని సంతోష్ మల్హోత్రా 'ఈటీవీ భారత్' ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇందుకోసం ప్రభుత్వం రుణాలు పెరిగినా.. ప్రజల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచేందుకు వారి చేతికి నేరుగా నగదు ఇవ్వడం చాలా అవసరమన్నారు. నగదు బదిలీ కోసం కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించనవసరం కుడా లేదని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ప్రమాణాలను విస్త్రతం చేయడం ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి బడ్జెట్లో చేసే కేటాయింపుల ద్వారానే ఎక్కువ మందికి నగదు అందించొచ్చని పేర్కొన్నారు.
'ప్రపంచ ఆర్థికవేత్తలంతా నగదు బదిలీ లేదా కనీస ఆదాయం హామీనే సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 40 శాతం పేద ప్రజలకు నెలకు రూ.500 చొప్పున నగదు ఇవ్వాలని నా అభిప్రాయం.' అని అన్నారు సంతోష్.
సీనియర్ సిటిజన్లకు, భర్త చనిపోయన మహిళలకు, దివ్యాంగులకు.. గత ఏడాది మార్చిలో ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా చేసే నగదు బదిలీ ఒక్కటే ఆర్థిక పునరుద్ధరణకు సరిపోదని పేర్కొన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ..
కరోనా కారణంగా పట్టణాలను వీడి లక్షలాది మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. అక్కడ వారికి ఉపాధి కల్పించేందుకు.. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కోసం కేటాయింపులు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని మల్హోత్రా పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలకూ ఉపాధి హమీ పథకాన్ని విస్తరించాలని కేంద్రానికి సూచించారు. అలా చేస్తేనే గ్రామీణ ప్రాంతాలను వీడి వలస జీవులు మళ్లీ పట్టణాలకు వచ్చేందుకు ఇష్టపడతారని విశ్లేషించారు.
లాక్డౌన్తోనే ఎక్కువ నష్టం..
కరోనా ప్రభావం కంటే.. సరైన ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని పేర్కొన్నారు సంతోష్ మల్హోత్రా. ప్రజల జీవితాలపైనా ఇది తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై కరోనా ప్రభావం, లాక్డౌన్ ప్రభావం ఎంత అనేది వేర్వేరుగా అంచనా వేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల కారణంగానే.. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21 తొలి త్రైమాసికంలో జీ20 దేశాల్లో ఏ ఇతర దేశంలో లేనంతగా క్షీణించిందని సంతోష్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా లాంటి మోస్తరు జనాభా ఉన్న దేశం నాలుగు రోజుల లాక్డౌన్ నోటీసులు జారీ చేస్తే.. మన దేశంలో కేవలం 4 గంటల్ల నోటీసుల్లోనే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని కేంద్రంపై విమర్శలు చేశారు మల్హోత్రా.
తలసరి ఆదాయానికి గండి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాల ప్రకారం.. తలసరి ఆదాయం రూ.లక్ష దిగువకు చేరొచ్చని అంచనాలున్నాయి. ఉద్యోగాల కోత, ఉపాధి లేమి వంటివి ఇందుకు కారణం.
ప్రస్తుతం నెలకొన్న తలసరి ఆదాయంలో తగ్గుదల, ఉద్యోగాలు, వేతనాల్లో కోత వంటి పరిస్థితుల వల్ల పేదరికం భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మల్హోత్రా.
ఆ ఉద్ధీపన చాలదు..
ఆర్థిక పునరుద్ధరణ పేరుతో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు మాత్రమే దన్నుగా నిలిచేందుకు ప్రత్యేక రుణ సదుపాయం అందించడం సరికాదని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. డిమాండ్ లేనప్పుడు ఎంఎస్ఎంఈలు ఉత్పత్తిని పెంచలేవని స్పష్టం చేశారు. వినియోగాన్ని పెంచేలా ప్రజలకు నగదు బదిలీ చేస్తే.. వారి కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. తద్వారా ఉత్పత్తి పెంచేదుకు ఎంఎస్ఎంఈలకూ వీలుంటుందని స్పష్టం చేశారు.
ప్రజారోగ్యంపై కేటాయింపులు పెరగాలి..
ప్రజా ఆరోగ్యంపై కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సంతోష్ మల్హోత్రా. ఇది భారీ ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు మాత్రమే కాకుండా ఉపాధి పెంచేందుకు కూడా ఉపయోపడుతుందని పేర్కొన్నారు.
జీడీపీలో 1.5 శాతాన్ని మాత్రమే ప్రజారోగ్యానికి కేటాయిస్తున్నామని.. దాన్ని 2.5 శాతానికి పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
మౌలిక సదుపాయాల కల్పన కీలకం..
కరోనాతో ఎక్కువ మంది ఇంటి నుంచి పని చేయడం సహా డిజిటల్గా కావాల్సిన పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాలపై అధికంగా దృష్టి సారిస్తోంది. అయితే డిజిటలీకరణపై మాత్రమే దృష్టి సారించడాన్ని.. మల్హోత్రా తప్పుబట్టారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది చాలా కీలకమని వివరించారు.
వ్యవసాయ చట్టాల విషయంలో ఏకపక్ష నిర్ణయం సరికాదు..
రాష్ట్రాలను సంప్రదించకుండా.. మూడు నూతన వ్యవసాయ చట్టాల అమలుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని మల్హోత్రా తప్పుబట్టారు.
'మన దేశ వ్యవసాయ రంగం చాలా వైవిధ్యమైంది. 8 రకాల వాతావరణ ప్రాంతాలు, 50 రకాల పంట ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఓకే విధమైన చట్టాలు పని చేయవు.' అని పేర్కొన్నారు.
నీటి సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు బిందు సేద్యం వంటి వాటికి 2021-22 బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చూడండి:'ప్రభుత్వం ఈసారి ఆర్బీఐ నుంచి అప్పు చేయాలి'