ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు సమయం దగ్గర పడుతోంది. ప్రత్యక్ష పన్నుల సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని వివిధ రాష్ట్రాల్లోని ఆదాయ పన్ను శాఖ అధికారులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదేశించింది.
దీనిపై సీబీడీటీ సభ్యురాలు(ఆదాయం) నీనా కుమార్ అన్ని ప్రాంతీయ శాఖ ఉన్నతాధికారులకు ఓ లేఖ రాశారు. బడ్జెట్లో నిర్దేశించిన రూ.12లక్షల కోట్ల పన్ను వసూలు లక్ష్యాన్ని గడువులోపు పూర్తిచేయాలని సూచించారు. ఈ నెల 23 నాటికి నిర్దేశించిన లక్ష్యంలో 85 శాతం (రూ.10లక్షల21వేల251 కోట్లు) మాత్రమే వసూలయినట్టు వెల్లడించారు.
మిగతా 15 శాతం పన్ను వసూళ్ల సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఇందులో భాగంగా పన్నుల వసూలు లక్ష్యాలను అందుకునేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టాలన్నారు నీనా కుమార్.
ఇటీవలే దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు సీబీడీటీ ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మూడీ. పన్నుల సేకరణలో తగ్గుదలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని ఈ నెల 31 లోపు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.