భారత మొబైల్ మార్కెట్లోకి మరో కొత్త చైనా కంపెనీ అడుగుపెట్టబోతోంది. వివో సబ్బ్రాండ్ ఐక్యూఓఓ (iQOO- ఐ క్వెస్ట్ ఆన్ అండ్ ఆన్) 5జీ ఫోన్తో వచ్చే నెల ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, భారత్లో మాత్రం ఈ కంపెనీ స్వతంత్ర సంస్థగా వ్యవహరించనుంది. ప్రీమియం కేటగిరీలో ఫోన్లు తీసుకురానుంది.
ఎంట్రీకి సన్నద్ధం..
వచ్చే నెల ఫోన్ విడుదల చేస్తున్నామని ఆ కంపెనీ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ గగన్ అరోడా తెలిపారు. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో కొత్త బ్యాటరీ టెక్నాలజీతో 5జీ ఫోన్ను పోటీ ధరలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఏడాదిలో 10 లక్షల ఫోన్లు అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తొలి దశలో ఆన్లైన్ అమ్మకాలు చేపట్టనున్న ఈ కంపెనీ.. ఆఫ్లైన్లోనూ అమ్మకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే బెంగళూరులో ఓ కార్యాలయాన్ని నెలకొల్పి 80 మందితో కూడిన ఓ బృందాన్ని సిద్ధం చేసుకుంది. నొయిడాలో ఉన్న వివో సదుపాయాలను వినియోగించుకుంటామని, 100 శాతం మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫోన్లు తీసుకొస్తామని అరోడా తెలిపారు.
ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్ ఇలా..
భారత స్మార్ట్ఫోన్ విభాగంలో ప్రీమియం సెగ్మెంట్లో (రూ.30వేలు పైబడి) భారీ వృద్ధి కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంతో పోల్చినప్పుడు ఇది 66 శాతంగా ఉందని కౌంటర్పాయింట్ రీసెర్చి పేర్కొంది. ఇందులో వన్ప్లస్ (35 శాతం) అగ్రస్థానంలో ఉండగా.. శాంసంగ్ (23 శాతం) యాపిల్ (22 శాతం)తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:ఇకపై ఫోన్ పే నుంచీ 'ఏటీఎం' సేవలు