దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ కొవిడ్ సంక్షోభం తర్వాత తిరిగి భారీగా పుంజుకుంది. సెప్టెంబర్తో ముగిసే త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు జీవన కాల గరిష్ఠం వద్ద 5 కోట్లకు పెరిగాయని రిసెర్చ్ సంస్థ కెనాలీస్ నివేదిక తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 4.2 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల వాటా 76 శాతానికి చేరినట్లు కెనాలీస్ సర్వే పేర్కొంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో టాప్ 5 కంపెనీలైన షియోమీ, శాంసంగ్, వీవో, రియల్మీ, ఒప్పోల షిప్మెంట్లు భారీగా పెరిగినట్లు సర్వేలో తేలింది.
మార్కెట్ లీడర్గా షియోమీ..
2020 క్యూ3లో 26.1 శాతం మార్కెట్ వాటా (13.1 మిలియన్ యూనిట్లు)తో షియోమీ మార్కెట్ లీడర్గా నిలిచింది.
దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ 20.4 శాతం మార్కెట్ వాటా(10.2 మిలియన్ యూనట్లు)తో.. వీవోను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.
17.6 శాతం (8.8 మిలియన్ యూనిట్లు) మార్కెట్ వాటాతో వివో, 17.4 శాతం (8.7 మిలియన్ యూనిట్లు) వాటాతో రియల్మీ, 12.1 శాతం (6.1 మిలియన్ యూనిట్లు) వాటాతో ఒప్పోలు వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నాయి.
లగ్జరీ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్కూ.. మూడో త్రైమాసికం కలిసొచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో పోలిస్తే దాదాపు రెండంకెల వృద్ధితో 8 లక్షల యూనిట్లు షిప్మెంట్లు నమోదయ్యాయి.
గత ఏడాది సెప్టెంబర్తో త్రైమాసికంతో పోలిస్తే.. 2020 క్యూ3లో దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల వాటా 74 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది. అయితే ఇది జూన్ త్రైమాసికంతో నమోదైన 80 శాతం మార్కెట్ వాటా కన్నా తక్కువగా ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:డాక్టర్ రెడ్డీస్ ఐటీ విభాగాలపై సైబర్ దాడి