సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ మరో రికార్డు సాధించింది. తొలి సారి కంపెనీ విలువ ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.74 లక్షల కోట్ల పైమాటే.
అమెరికా స్టాక్ మార్కెట్లో ఫేస్బుక్ షేర్లు సోమవారం 4 శాతానికిపైగా.. పెరిగిన నేపథ్యంలో సంస్థ మార్కెట్ విలువ ఈ స్థాయికి పెరిగింది. ఫేస్బుక్ షేరు ధర ప్రస్తుతం 355.64 డాలర్ల వద్ద ఉంది.
షేర్ల పరుగుకు కారణం..
ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సంస్థలను బలవంతంగా కొనుగోలు చేసిందంటూ ఫేస్బుక్కు వ్యతిరేకంగా కొలంబియా జిల్లా కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. ఈ విషయం సహా.. సోషల్ నెట్వర్కింగ్ మార్కెట్లో గుత్తాధిపత్యానికి ఫేస్బుక్ ప్రయత్నిస్తోందనే వాదనను ఫిర్యాదు దారు నిరూపించలేకపోయారు. దీనితో ఈ కేసును కొట్టివేసింది న్యాయ స్థానం. ఈ విషయంపై ప్రకటన వెలువడగానే ఫేస్బుక్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. అయితే ఈ విషయంపై మరో పిటిషన్ దాఖలు చేసేందుకు మాత్రం అవకాశం ఇచ్చింది కోర్టు.
మరిన్ని వివరాలు..
ఫేస్బుక్ 2004లో ప్రారంభమైంది. మార్క్ జుకర్బర్గ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థులతో కలిసి దీనిని నెలకొల్పారు. మార్క్ జుకర్బర్గే ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 111 భాషల్లో సేవలందిస్తోంది ఫేస్బుక్.
2010లో ప్రారంభమైన ఇన్స్టాగ్రామ్ను 2012లో..1 బిలియన్ డాలర్లకు (రూ.7,430 కోట్లు దాదాపు) స్వాధీనం చేసుకుంది ఫేస్బుక్. ఆ తర్వాత వాట్సాప్ను 2014లో 19 బిలియన్ డాలర్లకు (రూ.141,165 కోట్లు దాదాపు) కొనుగోలు చేసింది. వాట్సాప్ 2009 నుంచి సేవలందిస్తోంది.
ఇదీ చదవండి:టెలిగ్రామ్లో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్