దేశంలో అత్యంత ఔదార్యం కలిగిన సంపన్నుడిగా ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ నిలిచారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్జీ రూ.7,904 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంటే ఏడాది పొడవున రోజుకు రూ.22 కోట్లు చొప్పున ఇచ్చినట్లు లెక్క. ఇంతకు ముందు ఈ రికార్డు హెచ్సీఎల్ టెక్ అధినేత శివ్ నాడార్ పేరిట ఉండేది.
గత ఆర్థిక సంవత్సరం శివ్ నాడార్ రూ.795 కోట్లు విరాళమిచ్చి రెండో స్థానంలో నిలిచారు. 2018-19లో శివ్ నాడార్ రూ.826 కోట్లు దానం చేసి అగ్రస్థానంలో నిలవగా.. ప్రేమ్జీ రూ.458 కోట్లు దానం చేశారు.
ఈ జాబితాలో దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. ముకేశ్ 2019-20 కాలంలో రూ.458 కోట్లు విరాళమివ్వగా.. అంతకుముందు రూ.402 కోట్లు దానంగా ఇచ్చారు.
ఈ వివరాలన్ని హరూన్ రిపోర్ట్ ఇండియా, ఎడిల్గేవ్ ఫౌండేషన్ రూపొందించిన నివేదికలో వెల్లడయ్యాయి.
నివేదికలో మరిన్ని వివరాలు..
- కరోనా సంక్షోభంలో కార్పొరేట్ దిగ్గజాలు తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. ఇందులో టాటా సన్స్ రూ.1,500 కోట్లు విరాళంగా ఇచ్చి అగ్రస్థానలో నిలవగా.. అజీమ్ ప్రేమ్జీ రూ.1,125 కోట్లు, అంబానీ రూ.510 కోట్లు ఇచ్చారు.
- పీఎంకేర్స్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.400 కోట్లు, టాటా గ్రూప్ రూ.500 కోట్లు విరాళమిచ్చారు.
- మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నందన్ నీలేకని (రూ.159 కోట్లు), ఎస్.గోపాలకృష్ణన్ (రూ.50 కోట్లు), ఎస్.డి.శిభులాల్ (రూ.32 కోట్లు) ఈ జాబితాలో చోటు సంపాదించారు.
- రూ.5 కోట్లకుపైగా విరాళమిచ్చిన 109 మంది వ్యక్తిగత దాతల్లో 7 మంది మహిళలు ఉన్నారు.
- ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ రూ.5.3 కోట్లు విరాళమిచ్చారు. అత్యంత పిన్న వయసున్న వ్యక్తిగత దాతగా నిలిచారు.
ఇదీ చూడండి:పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భలే డిమాండ్!