వారంలో కొన్ని రోజులు ఇంట్లో.. మరికొన్ని రోజులు కార్యాలయాల్లో పని చేసే (హైబ్రిడ్) విధానానికే ఐటీ ఉద్యోగులు, సంస్థల యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయని నాస్కామ్, ఇన్డీడ్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక తెలిపింది. జనవరి నుంచి వారంలో 3 రోజులు ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేసే అవకాశం ఉందని 'నాస్కామ్ రిటర్న్టు వర్క్ప్లేస్ సర్వే' నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. మధ్య వయస్సు ఉద్యోగులతో పోలిస్తే జూనియర్ (25 ఏళ్ల లోపు), సీనియర్ (40 ఏళ్లకు పైబడిన) ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మహిళా ఉద్యోగులు కూడా కార్యాలయాలకు వచ్చేందుకు ఉత్సుకత కనబరుస్తున్నారని, కొత్త పని విధానానికి అలవాటు పడేందుకు సిద్ధంగా ఉన్నారు.
- జనవరి నుంచి కనీసం 50 శాతం ఉద్యోగులను ఆఫీసు నుంచి పనిచేయించే ఉద్దేశంతో ఉన్నామని 72 శాతం సంస్థలు వెల్లడించాయి.
- హైబ్రిడ్ విధానానికి 70 శాతం కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. మున్ముందు ఈ తరహా పని విధానమే కొనసాగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
- నెల రోజుల్లో కార్యాలయాలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని 28 శాతం మంది, 6 నెలల తర్వాత వస్తామని 24 శాతం మంది తెలిపారు.
- ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించే విషయంలో డేటా భద్రత, క్లయింట్ల ప్రాధాన్యం, టీకా వేయించుకోవడం లాంటివి ప్రధాన పరిశీలనా అంశాలుగా ఉంటాయని నివేదిక వివరించింది.
ఇదీ చూడండి: 'వర్క్ ఫ్రమ్ హోం'కు స్వస్తి - ఉద్యోగుల ఆఫీసు బాట!