విద్యుత్ ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేవారిలో నమ్మకం పెంచేందుకు హీరో ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వాహనాల్లో తలెత్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేలా.. దేశవ్యాప్తంగా 20 వేల మంది మెకానిక్లకు (రోడ్ల పక్కల బైక్ పాయింట్లు నడిపిస్తున్న వారికి) ప్రత్యేక శిక్షణ ఇవ్వనునట్లు ప్రకటించింది. రానున్న మూడేళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది.
దీనితో పాటు వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20 వేల ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని కూడా హీరో ఎలక్ట్రిక్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇప్పటికే 4 వేల మంది మెకానిక్లకు శిక్షణ ఇచ్చింది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా 1,500 ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి.
లక్ష యూనిట్లు లక్ష్యం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ పేర్కొన్నారు. 2020-21తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద హీరో ఎలక్ట్రిక్ 53 వేల యూనిట్లు విక్రయించింది.
ప్రస్తుతం తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 75 వేల యూనిట్లుగా తెలిపారు నవీన్ ముంజల్. దీనిని మూడు లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. రానున్న రెండేళ్లలో వచ్చే డిమాండ్కు ఈ సామర్థ్యం సరిపోతుందని వివరించారు.
ఇదీ చదవండి:ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో 12 వేల ఉద్యోగాలు!