మాస్కుతో ఉపయోగించేలా నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్ను అపోలో కంప్యూటింగ్ లేబొరేటరీస్ (ఏసీఎల్) ఆవిష్కరించింది. స్వస్థవాయు పేరిట దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ రక్షణ, ఏరోస్పేస్ డిజైనింగ్, అభివృద్ధి రంగంలో పనిచేస్తోంది.
కొవిడ్-19 రోగులతోపాటు, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారూ దీన్ని ఉపయోగించేందుకు వీలుంది. రూ.లక్షకు లభించే ఈ వెంటిలేటర్ను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రులు, మెడికల్ వార్డులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇంటివద్ద చికిత్స తీసుకుంటున్న కొవిడ్-19 రోగులూ వినియోగించుకునే వీలుంది. 3 కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న ఈ వెంటిలేటర్ బ్యాటరీ సహాయంతోనూ 2-4 గంటల వరకు పనిచేస్తుంది.
నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్తో కలిసి పూర్తి దేశీయంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు ఏసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బద్దం జైపాల్ రెడ్డి తెలిపారు. దీనికి ఎన్ఏబీఎల్ అధీకృత ల్యాబ్లతోపాటు డైరెక్టర్ ఆఫ్ జనరల్ హెల్త్ సర్వీసెస్, కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తింపు లభించిందని తెలిపారు.
విండ్పైపు లేకుండానే
నోటిద్వారా విండ్పైపు అవసరం లేకుండా ముఖానికి గట్టిగా అమర్చిన నాన్ వెంటెడ్ మాస్కు ద్వారా ఇది ఆక్సిజన్ను అందిస్తుంది. ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ సరఫరా పైపులు, లేదా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను దీనికి అనుసంధానం చేయొచ్చు. రోగి శ్వాసను గుర్తిస్తూ ఏదైనా తేడా ఉంటే అలారమ్ మోగే ఏర్పాటూ ఉంది.
ఇదీ చదవండి: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు ఆమోదం