కరోనా మహమ్మారి.. సింగరేణిని కష్టాల్లోకి నెట్టింది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత నష్టాన్ని ఈ సంస్థ మూటగట్టుకుంది. గత రెండు నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా పడిపోవడంతో రూ.1477.08 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లింది. ఏప్రిల్, మే నెలల్లో 1.19 కోట్ల టన్నుల లక్ష్యానికి గానూ 62 లక్షల టన్నులే తవ్వింది. ఉత్పత్తి 44 శాతం తగ్గింది. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ 1 నుంచి భూగర్భ గనుల్లో తవ్వకం నిలిపివేయడం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది. గత నెల 21 నుంచి వీటిలో తిరిగి తవ్వకాలు ప్రారంభించినా ఉత్పత్తి పెద్దగా పెరగలేదు.
విద్యుత్ డిమాండ్ తగ్గడంతో..
సింగరేణి గనుల్లో తవ్వే బొగ్గును అత్యధికంగా విద్యుత్ కేంద్రాలకు, ఇతర పరిశ్రమలకు విక్రయిస్తుంది. దేశంలో లాక్డౌన్ అమలులోకి వచ్చాక విద్యుత్ డిమాండు పడిపోయింది. జనతా కర్ఫ్యూకు ముందు దేశవ్యాప్తంగా ఒకరోజు విద్యుత్ గరిష్ఠ డిమాండు లక్షా 70 వేల మెగావాట్లుండగా లాక్డౌన్ సమయంలో అది లక్షా 16 వేల మెగావాట్లకు తగ్గింది. తెలంగాణలో గత ఫిబ్రవరి 28న అత్యధికంగా 13,168 మెగావాట్ల డిమాండు ఉండగా, లాక్డౌన్ సమయంలో ఒక దశలో 4500 మెగావాట్లకు పడిపోయింది.
లక్ష్యం నెరవేరలేదు
సింగరేణి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు విక్రయిస్తారు. ఈ రాష్ట్రాల్లో విద్యుదుత్పత్తి అవసరం లేక బొగ్గు కొనుగోలు నిలిపివేశారు. ఒక మిలియన్ టన్ను బొగ్గును అమ్మితే దాదాపు రూ.300 కోట్ల ఆదాయం వస్తుంది. గత 2 నెలల్లో ఏకంగా 5 మిలియన్ టన్నుల బొగ్గు అమ్మకం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో 7 కోట్ల టన్నుల బొగ్గు తవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 6.20 కోట్ల టన్నుల కన్నా 80 లక్షల టన్నులు పెంచాలని లక్ష్యాన్ని పెట్టింది.
సంస్థపై తీవ్ర ప్రభావం
వాస్తవానికి గతేడాది(2019-20) కూడా తొలుత 6.70 కోట్ల టన్నుల లక్ష్యాన్ని పెట్టుకున్నా చివరికి 50 లక్షల టన్నులు తక్కువగా వచ్చింది. ఈ ఏడాది లాక్డౌన్ దెబ్బతీయడంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన కష్టమేనని తెలుస్తోంది. సింగరేణికి వచ్చే ఆదాయంలో 10 శాతం వరకు నికర లాభం ఉంటుంది. మొత్తం రూ.1477 కోట్లు ఆదాయం తగ్గడంతో రూ.147 కోట్లు నికర నష్టం వచ్చిందని అంచనా. ఇది సింగరేణి సంస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇదీ చదవండి: సింగరేణిలో ప్రాణాలకు విలువేది?