ఇంటర్ ఫలితాల వివాదంపై సీఎంకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లేఖ రాశారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యమే విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసిందని పేర్కొన్నారు. పది లక్షలమంది విద్యార్థుల ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్ స్పందించకపోవడంపై మండిపడ్డారు.
బోర్డు అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో రీకౌంటింగ్ చేసి నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.