భూ సేకరణ విషయంలో అధికారులపై హైకోర్టు ఆగ్రహం కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు నలుగురు అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ఏడో కన్స్ట్రక్షన్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.బద్రినారాయణ, రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ బి.శ్రీనివాసరెడ్డిలకు 3 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో వ్యాజ్యంలో రెండో డివిజన్ ఇరిగేషన్ విభాగం సూపరింటెండెంట్ టి. వేణు, తొగుట ఎస్ఐ శ్రీనివాసరెడ్డిలకు 2 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. ఈ శిక్షలను అధికారుల సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. అప్పీలుకు అవకాశం
అధికారులు అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షల అమలును 6 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా తొగుటలో పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టవద్దంటూ గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే తీర్పును ఉల్లంఘించి... పోలీసులతో బెదిరిస్తూ బలవంతంగా భూములును స్వాధీనం చేసుకుని పనులు చేయిస్తున్నారని కొందరు కోర్టు ధిక్కరణ కింద వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.
ఇదీ చూడండి : హైకోర్టులోనే తేల్చుకోండి రవిప్రకాశ్కు సుప్రీం సూచన