గాలి ద్వారా కూడా కరోనా మరొకరికి సోకుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్లు, భౌతికదూరం, శానిటైజర్తో పాటు.. ఇంట్లో గాలి, వెలుతురు కూడా ధారాళంగా ప్రసరించేలా ఉండాలని అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం వైరస్ వ్యాప్తి కట్టడికి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటితో వైరస్ వ్యాప్తిని అరికట్టి.. మహమ్మారిని అణిచివేద్దామని పిలుపునిచ్చింది.
"దేశంలో మహమ్మారి మళ్లీ పెట్రేగిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అలవాట్లను గుర్తుంచుకోవాలి. మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్తో పాటు ఇళ్లల్లో వెంటిలేషన్ పెంచుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుంది. సాధారణంగా ఇంట్లోని కిటికీలు, తలుపులు, ఎగ్జాస్ట్ సిస్టమ్స్తో దుర్వాసనలు బయటకు వెళ్తాయి. అదే ఆ ప్రాంతాల్లో ఫ్యాన్లు అమరిస్తే వైరస్తో కూడిన గాలి కూడా బయటకుపోయి ప్రమాదం తగ్గుతుంది" అని శాస్త్రీయ సలహా బృందం తెలియజేసింది.
ఇదీ చదవండి: ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు!
తాజా సూచనలివే..
ఎక్కువ వెంటిలేషన్ వచ్చేలా..
- సాధారణంగా కొవిడ్ బాధితుడు మాట్లాడటం, తుమ్మడం, దగ్గడం, నవ్వడం లాంటివి చేసినప్పుడు నోటిలోంచి తుంపర్లు బయటకు వస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. పెద్దపెద్ద తుంపర్లు నేరుగా భూమి ఉపరితలం మీదకు పడతాయి. అలాపడిన ప్రదేశాలను ఇతరులు ముట్టుకుని, అదే చేతులతో ముఖం, నోటిని తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి లోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేగాక, చేతులను తరచూ సబ్బుతో, శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. ఆ తుంపర్లు వైరస్ సోకిన వ్యక్తి నుంచి 2 మీటర్ల వరకు వ్యాపిస్తాయి.
- ఇక చిన్న చిన్న గాలి తుంపర్లు దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడం సహా.. ఫ్యాన్లు అమర్చుకుంటే మరింత ప్రయోజనకరం.
- పనిచేసే కార్యాలయాల్లో ఏసీలు వేసి, తలుపులు, కిటకీలు మూసివేస్తారు. అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం సహా ఎగ్జాస్ట్ ఫ్యాన్లనూ ఏర్పాటు చేయాలి.
ఇదీ చదవండి: తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాప్తి అధికం!
రెండు మాస్క్లు మంచిది..
కరోనా కట్టడికి మాస్క్ అత్యవసరం. రెండు మాస్క్లతో మరింత ప్రయోజనం ఉంటుంది. ఒక సర్జికల్ మాస్క్తో పాటు కాటన్ మాస్క్ను కలిపి పెట్టుకోవాలి. సర్జికల్ మాస్క్ ఒక్కటే పెట్టుకున్నట్లయితే దాన్ని ఒకేసారి వినియోగించాలి. డబుల్ మాస్క్తోపాటు దాన్ని వాడినప్పుడు కనీసం 5 సార్లు ఉపయోగించుకోవచ్చు. అయితే పెట్టుకున్న ప్రతిసారీ దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి.
కమ్యూనిటీ స్థాయి పరీక్షలు..
గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కరోనా నిర్ధరణ పరీక్షలు పెంచాలి. దీనికోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయడంలో శిక్షణ ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలను కచ్చితంగా పాటించి.. వైరస్ వ్యాప్తిని అడ్డుకుందామని నిపుణుల బృందం కోరింది.
ఇదీ చదవండి: 'కొవిడ్ ఓ కుట్రధారి.. క్రియాశీల వ్యూహాలతోనే కట్టడి'