దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. మధ్యప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ హోలీ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల ప్రజలు ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉజ్జయినికి చెందిన ఐదుగురు వైద్య విద్యార్థులు వినూత్న రీతిలో హోలీ పండుగ జరుపుకున్నారు. కరోనా వ్యాప్తి, జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా.. విద్యార్థులంతా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి సంబరాలు చేసుకున్నారు.
ఉజ్జయినిలోని ఫ్రీగంజ్లో వీరు ప్రదర్శన నిర్వహించారు. పీపీఈ కిట్లు, మాస్కులు ధరించిన వీరు.. ఒకరికొకరు రంగులు పూసుకుని సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. దారిన పోయేవారికి శుభాకాంక్షలు తెలపడం సహా పలువురితో హోలీ ఆడారు. జాగ్రత్తలు పాటించని వారికి మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలని సూచనలు చేశారు. హోలీని సురక్షితంగా ఎలా జరపాలి అనే విషయంపై అవగాహన కల్పించేందుకే ఈ రకంగా పండుగ జరుపుకున్నామని విద్యార్థులు వెల్లడించారు.
కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థుల వినూత్న ప్రదర్శన ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యప్రదేశ్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది.
ఇదీ చదవండి : ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనే 84శాతం కరోనా కేసులు