తమిళనాడువ్యాప్తంగా సంక్రాంతి సందడి కొనసాగుతోంది. సంప్రదాయ జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. మధురై జిల్లాలోని పలమేడులో ఈ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బసవన్నల రంకెలు, వాటిని అదుపు చేసేందుకు యువకుల ప్రయత్నాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు.
పలమేడు జల్లికట్టులో సుమారు 650 ఎద్దులు పాల్గొన్నాయని నిర్వహకులు తెలిపారు. మరోవైపు.. కొవిడ్-19 నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో పోటీదారుల సంఖ్య 150, ప్రేక్షకుల సంఖ్య 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. బరిలో నిలిచే యువకులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ నివేదిక అందించాలని తెలిపింది.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 31 వరకు జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఇప్పటికే మధురై జిల్లాలోని అవనియపురంలో ఈ పోటీలు జరిగాయి. అలంగానల్లూర్లో జరగాల్సి ఉంది.


