వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పంజాబ్కు చెందిన శిరోమణి అకాలీదళ్ కూటములపై కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్, భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. ఈ పార్టీలు కాకుండా వేరే వారితో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు శిరోమణి అధ్యక్షుడు సుఖ్బిర్ సింగ్ బాదల్ తెలిపారు.
ఇదివరకు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది శిరోమణి అకాలీదళ్. నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆ కూటమి నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో భాజపాతో మళ్లీ పొత్తు ఉండబోదని బాదల్ తేల్చి చెప్పారు. "మేం కూటముల కోసం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్, భాజపా, ఆప్లతో మేం పొత్తు కుదుర్చుకోలేం. ముఖ్యంగా భాజపాతో అసలే కుదరదు" అని వ్యాఖ్యానించారు.
కుర్చీ కోసం అమరిందర్
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు బాదల్. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్.. వ్యాక్సినేషన్ను సొంత లాభాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిపై దృష్టిపెట్టకుండా తన కుర్చీ కాపాడుకునేందుకు దిల్లీ వెళ్తున్నారని అన్నారు.
ప్రచారం కోసం కేజ్రీ
మరోవైపు, దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పబ్లిసిటీ కోసమే పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఒక్క స్కూల్ను పునర్నిర్మించి.. విద్యా వ్యవస్థనే బాగు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన మోసాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. దిల్లీలో కరోనా విజృంభణ అధికమై, పరిస్థితులు చేయిదాటి పోయిన సమయంలో కోర్టు ముందు లొంగిపోయారని అన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేని ఆ వ్యక్తి సీఎం పదవిలో ఉండేందుకు అనర్హులని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి- ప్రియుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన బాలికపై గ్యాంగ్ రేప్!