మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ నెలకు రు.100కోట్లు వసూలు చేయాలని అదేశించారని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ అంశంపై సభలో కాంగ్రెస్ నేత రవ్నీత్ సింగ్, స్వతంత్ర ఎంపీ నవనీత్ రవి రాణా, భాజపా సభ్యులు పీపీ చౌదరి, పూనం మహాజన్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
లోక్సభలో జీరో అవర్ సందర్భంగా శివసేన, ఎన్సీపీ సభ్యుల అందోళనల నడుమే భాజపా నేత మనోజ్ కొటాక్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సస్పెన్షన్కు గురైన సచిన్ వాజేను ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదేేశించారని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పరమ్బీర్ సింగ్ రాసిన లేఖలో ఉందని తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన వారే అక్రమ వసూళ్ల కోసం అధికారులను ఉపయోగించుకుంటున్నారని ఈ లేఖ తేటతెల్లం చేస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా ఈ విషయంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒక్క మాటైనా మాట్లాడలేదని విమర్శించారు. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, మహారాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.
ఇది అత్యంత తీవ్రమైన విషయమని మరో భాజపా ఎంపీ రాకేశ్ సింగ్ అన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశంతో ముడిపడి ఉందని చెప్పారు. అక్రమ వసూళ్ల వ్యవహారంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి సంబంధాలున్నాయని పరమ్బీర్ లేఖ స్పష్టం చేస్తోందన్నారు.
" మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలు మరెవరో చేసినవి కాదు. ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ ఈ ఆరోపణలు చేశారు. 16ఏళ్ల పాటు సస్పెండ్ అయిన ఏపీఐ ర్యాంకు అధికారిని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వెనకేసుకు రావాల్సిన అవసరమేంటి? ఒక ముంబయిలోనే రూ.100కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే.. మహారాష్ట్ర మొత్తం కలిపి ఆ లెక్క ఎంత ఉంటుంది?"
--రాకేశ్ సింగ్, భాజపా ఎంపీ.
తోసిపుచ్చిన శివసేన..
అయితే భాజపా ఆరోపణలను శివసేన తోసిపుచ్చింది. ముంబయిలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని భాజపా 14 నెలలుగా కుట్ర చేస్తోందని ఆరోపించింది. ఈ వ్యవహారం మొత్తం భాజపా కుట్రలో భాగమని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. లేఖ రాసిన ముంబయి మాజీ పోలీసు కమిషనర్ అత్యంత అవినీతి అధికారి అని ఆరోపించారు.
భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర సంస్థలను వినియోగిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ విమర్శించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో మాత్రమే కాదు భాజపా అధికారంలో లేని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
రాజ్యసభ వాయిదా..
రాజ్యసభలోనూ ఈ విషయంపై దుమారం చెలరేగింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే అధికార పక్ష సభ్యులు మహారాష్ట్ర అంశాన్ని లేవనెత్తారు. దీనిపై మాట్లాడవద్దని సభ్యులకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ విజ్ఞప్తి చేశారు. అనంతరం పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ను ప్రశ్న అడగాలని కాంగ్రెస్ నేత ఛాయ వర్మకు సూచించారు. ఈ సమయంలోనే ట్రెజరీ బెంచ్ సభ్యులు మళ్లీ ఆందోళనలు చేపట్టారు. గందరగోళం నడుమ ఛాయ వర్మ అడిగిన ప్రశ్న తనకు అర్థం కాలేదని, మహారాష్ట్ర అంశాన్ని లేవనెత్తేందుకు జావడేకర్ ప్రయత్నించారు. అనంతరం డిప్యూటీ ఛైర్మన్ సభను ఒకసారి వాయిదా వేశారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాలకు ముందే మహారాష్ట్ర అంశంపై భాజపా సభ్యులు అందోళనకు దిగారు. రాష్ట్రాలకు సంబంధించి విషయాలను లేవనెత్తొద్దని ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులకు పదేపదే విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: పరమ్Xదేశ్ముఖ్- 'మహా'లో లేఖ దుమారం